కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి గారు రచించిన "నీవే గతియని" కీర్తన (కల్యాణి రాగం)కు తాత్పర్యం మరియు విశేషాలు
పల్లవి
నీవే గతియని నెర నమ్మినాను జగదంబా
నీవనాథ రక్షకి మాయమ్మా
అర్థం:
జగదంబా: లోకమాతా!
నీవే గతి అని: నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని.
నెర నమ్మినాను: పూర్తిగా (నిశ్చయంగా) నమ్మాను.
నీవు అనాథ రక్షకి: దిక్కులేని వారిని కాపాడే దానివి నువ్వే.
మా అమ్మ: మా తల్లివి.
తాత్పర్యం: ఓ జగన్మాతా! లోకానికే తల్లివైన నువ్వే నాకు దిక్కని నేను నిన్నే నమ్ముకున్నాను. దిక్కులేని వారిని ఆదుకునే మా అమ్మవు నువ్వే.
అనుపల్లవి
రావే వేగమే మనవి వినమ్మా శ్రీ
రాజ రాజేశ్వరీ దేవీ (నీవే)
అర్థం:
శ్రీ రాజరాజేశ్వరీ దేవీ: ఓ రాజరాజేశ్వరీ దేవి!
వేగమే రావే: త్వరగా రామ్మా.
మనవి వినమ్మా: నా ప్రార్థనను ఆలకించు.
తాత్పర్యం: ఓ శ్రీ రాజరాజేశ్వరీ దేవీ! ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చి నా విన్నపాన్ని ఆలకించు తల్లీ. నీవే నా గతి అని నమ్మాను.
చరణం
కామ కోటి పీఠ నివాసిని కల్యాణీ
శ్యామ కృష్ణ సోదరీ దేవీ
నీదు చరితము విని విని పాద కమలమును
కోరితిని సదా గతియని
పొగడి పొగడి చరణము గొలిచేనమ్మా
బంగారు కామాక్షి (నీవే)
అర్థం:
కామకోటి పీఠ నివాసిని: కంచిలోని కామకోటి పీఠంలో నివసించేదానా!
కల్యాణీ: శుభాలను కలిగించే దానా!
శ్యామకృష్ణ సోదరీ: శ్యామకృష్ణుడైన విష్ణువు యొక్క సోదరివి (శ్యామకృష్ణ అనేది కవి ముద్ర కూడా).
నీదు చరితము విని విని: నీ కథలను పదే పదే విని.
పాద కమలమును కోరితిని: నీ పద్మాల్లాంటి పాదాలనే ఆశ్రయించాను.
పొగడి పొగడి: నిన్ను స్తుతించి, స్తుతించి.
చరణము గొలిచేనమ్మా: నీ పాదాలను సేవించుకుంటున్నాను తల్లీ.
బంగారు కామాక్షి: బంగారుమయమైన ఓ కామాక్షీ దేవి!
తాత్పర్యం: కంచి కామకోటి పీఠవాసినివి, మంగళప్రదమైన దానివి, విష్ణువుకు సోదరివైన ఓ బంగారు కామాక్షీ! నీ మహిమలను పదే పదే విని, నీ పాదపద్మాలే శరణమని కోరుకున్నాను. నిన్ను మనసారా స్తుతిస్తూ, ఎల్లప్పుడూ నీ పాదాలనే సేవించుకుంటున్నాను తల్లీ.
విశేషాలు
చరణము vs శరణము:
చాలా పుస్తకాల్లో "శరణము గొలిచేనమ్మా" అని ఉంటుంది. శరణు అంటే 'ఆశ్రయం' అని అర్థం. కానీ కొలుచు) అనే పదానికి 'సేవించు' లేదా 'పూజించు' అని అర్థం వస్తుంది. 'శరణును సేవించు' అన్న ప్రయోగం కంటే, అంతకుముందు వాక్యంలో 'పాద కమలము' అని ప్రస్తావించారు కాబట్టి, ఇక్కడ 'చరణము' (పాదము) అని ఉండటమే సరైనది. అంటే 'నీ పాదాలను సేవిస్తున్నాను' అని భావం.
కామకోటి పీఠం:
లలితా సహస్రనామాల్లోని 589వ నామమైన "కామకోటికా" అనే పేరును స్మరిస్తూ శ్యామశాస్త్రి గారు అమ్మవారిని కామకోటి పీఠ నివాసినిగా సంబోధించారు.
శ్యామకృష్ణ సోదరి:
శ్యామశాస్త్రి గారు తన కీర్తనల్లో తన నామాన్ని 'శ్యామకృష్ణ' అని ముద్రగా వాడేవారు. అలాగే పార్వతీదేవి విష్ణువు (శ్యామకృష్ణుడు) కు సోదరి అనే పురాణ గాథను ఇక్కడ అన్వయించారు.

No comments:
Post a Comment