మాయమ్మా నన్ను బ్రోవవమ్మా
పల్లవి
మాయమ్మా నన్ను బ్రోవవమ్మా మహా మాయా ఉమా
అనుపల్లవి
సత్యానందా సానందా నిత్యానందా ఆనందా అంబ (మాయమ్మా)
చరణం
శ్యామ కృష్ణ జననీ తామసమేల రావే దేవీ
శ్యామళే నీలోత్పలే హిమాచల సుతే సుఫలే శివే (మాయమ్మా)
స్వర సాహిత్య
మాధవాది వినుత సరసిజాక్షి
కంచి కామాక్షి తామసము సేయక
రమ్మా మరకతాంగి మహా త్రిపుర
సుందరి నిన్నే హృదయము పట్టుకొని (మాయమ్మా)
తాత్పర్యం
పల్లవి:
అమ్మా! నన్ను రక్షించు. నువ్వు మహా మాయవు, ఉమా దేవివి. ఓ నా తల్లి! నన్ను కాపాడు.
అనుపల్లవి:
ఓ అంబా! నీవు సత్య స్వరూపిణివి, నిత్యమైన ఆనందాన్ని ప్రసాదించే దానివి, ఆనంద స్వరూపిణివి. ఎల్లప్పుడూ ఆనందంలో ఓలలాడించే తల్లివి.
చరణం:
శ్యామకృష్ణుని (శ్యామశాస్త్రి ముద్ర) కన్న తల్లి! ఇంకా ఆలస్యం దేనికి దేవీ? రావే! శ్యామలవు, నీలోత్పలవు (నల్ల కలువ వంటి కళ్లు కలదానవు), హిమవంతుని కుమార్తెవు (పార్వతి), శుభ ఫలితాలను ఇచ్చే శివుని అర్ధాంగివి.
స్వర సాహిత్యం:
లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి మొదలైన దేవతలచే స్తుతించబడే పద్మనేత్రివి నీవు. కంచిలో కొలువైన కామాక్షివి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రావమ్మా! మరకత మణి వర్ణం వంటి మేని ఛాయ కలిగిన ఓ మహా త్రిపుర సుందరి! నిన్నే నా హృదయంలో గట్టిగా పట్టుకొని (ప్రతిష్టించుకొని) ఉన్నాను.
విశేషాలు
నామ విశిష్టత:
మహామాయ: లలితా సహస్రనామాల్లోని 215వ నామం.
సత్యానంద: లలితా సహస్రనామాల్లోని 646వ నామమైన 'సత్యానంద స్వరూపిణి'ని ఇది సూచిస్తుంది.
క్షేత్ర ప్రస్తావన: చరణంలో వాడిన "నీలోత్పలే" (నల్ల కలువ) అనే పదానికి కేవలం అర్థం మాత్రమే కాకుండా, ఇది తిరువారూర్ క్షేత్రంలో కొలువైన 'నీలోత్పలాంబ' దేవిని సూచిస్తుందని పెద్దల అభిప్రాయం.
చివరిలో "హృదయము పట్టుకొని" అనే పదప్రయోగంపై ఒక విశ్లేషణ ఉంది. సాధారణంగా పుస్తకాల్లో దీనిని 'నిన్ను నా హృదయంలో సింహాసనం వేసి కూర్చుండబెట్టుకున్నాను' అని అనువదిస్తారు.
, ఆ అర్థం రావాలంటే అది "హృదయమున పట్టుకొంటి" లేదా "హృదయమున పెట్టుకొంటి" అని ఉండాలి. ప్రస్తుత రూపంలో ఇది 'నిన్నే నా హృదయం గట్టిగా పట్టుకుంది' అనే భావనను ఇస్తుంది.

No comments:
Post a Comment